అమితాబ్, ధర్మేంద్రలకు బాంబు బెదిరింపులు
ముంబై : బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ , ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రల నివాసాల సమీపంలో బాంబులు పెట్టినట్లు ఓ ఆగంతకుడు నాగ్పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెప్పాడు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ మంగళవారం వచ్చినట్లు తెలుస్తోంది. నాగ్పూర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు.
ముంబైలోని జుహు, విలే-పార్లే, గమ్దేవి పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్ద తనిఖీలు చేశారు. అయితే అనుమానించదగిన వస్తువులేవీ కనిపించలేదు. ఈ ఆగంతకుడు మరో బెదిరింపు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడి చేయడం కోసం 25 మంది సాయుధులు ముంబైలోని దాదర్కు చేరుకున్నారని చెప్పినట్లు సమాచారం. అమితాబ్కు ముంబైలో ఐదు విలాసవంతమైన బంగళాలు ఉన్నాయి. ధర్మేంద్రకు జుహూలో ఓ బంగళా ఉంది.