కరెంట్ కష్టాలు గుర్తుంచుకోండి

కరెంట్ కష్టాలు గుర్తుంచుకోండి

నర్సాపూర్ రోడ్ షోలో కేటీఆర్
ముద్ర ప్రతినిధి, మెదక్ : 2014కు ముందు కరెంట్ కోసం పడిన కష్టాలు గుర్తుంచుకోవాలని ప్రజలను బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు, కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ అనలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైతుబంధు దుబారా అంటే 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73,000 కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డ గొంతుకోసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసిన వారు ఒక్క ఛాన్స్ అని వచ్చి అడుగుతున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కొడంగల్,  కామారెడ్డిలో ఓడిపోతారన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమాలాంటి ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.  కాంగ్రెస్, బీజేపీ నాయకులు రకరకాల డ్రామాలు వేస్తున్నారని,  ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు ఇస్తా అని మోడీ అనలేదా? అని ప్రశ్నించారు. రూ.400 సిలిండర్ ను రూ.1200 చేసిన ఘనత మోడీదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అసైన్డ్ భూములను పట్టాలు చెయ్యబోతున్నామని, సునీతారెడ్డి గెలిస్తే నర్సాపూర్ కు ఐటీ హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వస్తాయన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సమూచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘటించారు. బీఆర్ఎస్ గెలిస్తే నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలుపుతామని హామీ ఇచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతారెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తుందన్నారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి, దేవేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, చంద్రగౌడ్, మన్సూర్, వెంకట్ రెడ్డి, రమేష్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.