కొనసాగుతున్న భూకబ్జాదారుల అరెస్టులు

కొనసాగుతున్న భూకబ్జాదారుల అరెస్టులు

మరో భూ కబ్జాదారుడు కొమ్ము భూమయ్య అరెస్ట్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ లో భూకబ్జాదారుల అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు ఊచలు లెక్కబెట్టగా మరో రాజకీయ నేత కొమ్ము భూమయ్యను గురువారం జ్యూడిషల్ రిమాండ్ కు తరలించారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి,  అక్రమంగా భూకబ్జాకు పాల్పడిన నిందితుడు తీగల గుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్యను అరెస్టుచేసి, రిమాండ్ కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు స్పష్టం చేశారు. నకిలీ ధ్రువపత్రాలను తయారుచేయడమేగాక, నకిలీ స్టాంపులు, సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కరీంనగర్ లోని చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన దీటీ మధు, తండ్రి లక్ష్మీరాజం 2013 సంవత్సరంలో ఆరెపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 311, ఓపెన్ ప్లాట్ నంబర్.5 లో గల 91 గజాల ఇంటి స్థలాన్ని కరీంనగర్ కు చెందిన నల్లవెల్లి రాజు, తండ్రి మాంకాలయ్య నుండి ఖరీదు చేశాడు. ఇట్టి స్థలాన్ని ఇంటి నిర్మాణం కొరకై  తన భార్య  ఎండల సరిత  పేరున మార్చాడు. 2013 నుండి ఇట్టి స్థలం వారి ఆధీనంలోనే ఉంది. మున్సిపాలిటీ అనుమతి తీసుకొని, ఇంటి నంబర్ 4-63/A/A/2/A/1 నిర్మించుకున్నాడు. ఇదిలా ఉండగా గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి అక్రమంగా, తన ఇంటిలో చొరబడి తనకున్న ఇంటిని కాజేయాలనే నేరపూరిత కుట్రతో ఇంటి నెంబర్ ప్లేట్ ని తొలగించి మరొ ఇంటి నెంబర్ 1-42/6/E/4/A/1 గల ప్లేటును తగిలించి ఇంటి స్థలం తనదని, ఇట్టి స్థలాన్ని తను తీగుట్టపల్లి కి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య  నుండి కొనుగోలు చేశానని ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని లేనియెడల చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 31న దీటి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ Cr. No. 69/2024  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

విచారణ జరిపిన కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్,  తీగలగుట్టపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ వ్యక్తులిద్దరూ దీటి మధుకు చెందిన ఇంటిని కాజేయాలని దురుద్దేశంతో  నేరపూరిత కుట్రను పన్ని సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ సంతకాలను ఫోర్జరీ చేసి అదే ఇంటి స్థలంపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని విచారణలో తేలింది. దీంతో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 69/2024, U/Sec 420, 465,467,471,447,427,506,120-b r/w 34 IPC పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను  కోర్టుకు హాజరుపరచగా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్  మెజిస్ట్రేట్ ముద్దాయిలకు 15 రోజుల రిమాండ్ విధించారు.