తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: భట్టి

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: భట్టి
  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 
  • ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధమని వెల్లడి 
  • ధనిక రాష్ట్రంలోనూ ప్రజల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని విసుర్లు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోవడానికి సిద్ధమని ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. అమరవీరులు దేనికోసమైతే త్యాగాలు చేశారో వాటిని సాధిస్తామని పేర్కొన్నారు. ఇనుప కంచెలు బద్దలుకొట్టి ప్రారంభమైన ప్రజాపాలన నిరాటంకంగా కొనసాగుతుందని భట్టి చెప్పారు. 

ధనిక రాష్ట్రంలోనూ ప్రజలు కష్టాలతో సతమతం కావడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కొందరి కోసం అందరు అన్నట్లుగా గతంలో పాలన కొనసాగిందని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారంటూ రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మాత్రం అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అంచనా బడ్జెట్.. 
అంచనా వ్యయం రూ.2,75,891 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు