అధికారంలో వారి కుటుంబమే బాగుపడింది

అధికారంలో వారి కుటుంబమే బాగుపడింది
  • మదన్ రెడ్డికి మిత్ర ద్రోహి కెసిఆర్
  • కాంగ్రెస్ ద్రోహి సునీతా రెడ్డి
  • నర్సాపూర్ సభలో రేవంత్ రెడ్డి ఫైర్
  • ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమం
  • కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా

ముద్ర ప్రతినిధి, మెదక్:కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో ఆయన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని చిరకాల మిత్రుడని చెబుతూనే టికెట్ ఇవ్వకుండా ద్రోహం  చేసిన కెసిఆర్ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి చంకలో చేరిన సునీతా రెడ్డికి టికెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు.

వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులకు, ఉపాధి కూలీలకు, రైతు కూలీలకు కూడా అండగా ఉంటామన్నారు. గృహలక్ష్మి పథకం కింద పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్, మహిళలకు రూ.2500 అందిస్తామన్నారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎవరికీ రాలేదని, కానీ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున అందిస్తుందన్నారు.  కాంగ్రెస్ గెలుస్తుందని, అప్పుడు పెన్షన్ రూ.4వేలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని హామీ ఇచ్చారు. మేం ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒకే ఒక మంచి పని చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సభలో అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, అద్దంకి దయాకర్, సుహాసిని రెడ్డి, శేష సాయిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కాలేక్ తదితరులు పపాల్గొన్నారు.