మేం కూడా రామభక్తులమే... దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేం కూడా రామభక్తులమే... దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్
  • లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా 
  • బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాము కూడా రామభక్తులమేనని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామమందిరం అంశాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. సూర్యాపేట నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టారని... అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారన్నారు.