చేవెళ్ళ కాంగ్రెస్ జనజాతర సభను విజయవంతం చేయండి
హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పిలుపు
మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతంలో శనివారం (రేపు) నిర్వహించ తలపెట్టిన జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. మన దేశ భవిష్యత్తుకు… ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైన లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డమీద నుంచి కాంగ్రెస్ పార్టీ “జంగ్ సైరన్” మోగించనుందని ఆయన గుర్తు చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసా (మేనిఫెస్టో)ను ఈ వేదిక నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేయడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని.. చేవెళ్ళ బంపర్ మెజార్టీతో గెలుస్తామని రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తుక్కుగూడ సభకు పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నట్టు… ఈ మేరకు జన సమీకరణ చేస్తున్నామని వివరించారు.