నిజామాబాద్‌ లో కవిత ఫోకస్‌

నిజామాబాద్‌ లో కవిత ఫోకస్‌
kcr daughter kavitha

నిజామాబాద్‌ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా. జిల్లా వ్వవసాయ అధారిత జిల్లాగానూ పేరుంది. ఈ జిల్లాలోని చాలా మంది నాయకులు జాతీయ, రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన నేతలున్నారు. ఈ జిల్లాలో ముస్లిం మైనార్టీల సంఖ్య కూడా ఎక్కువే. అయితే రాజకీయ పార్టీలు 2022లో ఏం చేశాయి, వాటి తీరు విషయానికి వస్తే.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తన ఉనికి కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకీ పార్టీ మరింత బలోపేతం చేస్తూ జిల్లా ముఖ్యనేతలు మరోసారి పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలకు తొమ్మిదింటిలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఏడాదిలో నియోజకవర్గాల్లో కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అధికార పార్టీ రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది. ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేస్తూ ఆయా పార్టీలలో ఉన్న క్యాడర్‌ ను, ద్వితియ శ్రేణి నాయకులను బీఆర్‌ఎస్‌ పార్టీలోకి తీసుకున్నారు.

నిజామాబాద్‌ నగరంలోని బీజేపీ నుంచి ఇప్పటికే 10 మంది కార్పొరేటర్లను బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేర్పించుకోవటంలో జిల్లా నాయకత్వం విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడుగా పీయూసీ చైర్మన్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్‌ లోకి చేరికలు కొనసాగాయి. ఈ ఏడాది ఎమ్మెల్సీ కవిత జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. కార్యకర్తల్లో జోష్‌ నింపి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. ఈ ఏడాదిలోనే జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ ను సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభించారు. నిజామాబాద్‌ నగరంలో ఐటీ హబ్‌ భవన నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో వైద్య, వ్యవసాయ రంగంపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తులను బుజ్జగించి వారిని గాడిలో పెట్టడంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చోరవ చూపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేశారు. బోధన్‌ ఎమ్మెల్యే మన ఊరు మన ఎమ్మెల్యే పేరుతో ఆయన నియోజకవర్గంలో పలు గ్రామాలు చుట్టివచ్చారు. ఏడాది చివరిలో జిల్లా బీఆర్‌ఎస్‌ కీలక నేత ఎమ్మెల్సీ కవితపై ఢల్లీి లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు, ఈడీ ఛార్జిషీట్లలో కవిత పేరు పేర్కొనడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక బీజేపీ పార్టీ 2022లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వస్తున్నారు. జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటించారు. నిజామాబాద్‌ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర మొదలు కాలేదు. అయితే గత మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ 28 కార్పొరేటర్లను గెలుచుకుంది. అందులోంచి 10 మంది కార్పోరేటర్లు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇది బీజేపీకి దెబ్బ అనే చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ జిల్లాలో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీలో వర్గ విభేదాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఏడాది బీజేపీ కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులను నియమించింది. పార్టీ బలోపేతం కోసం పదాధికారుల సమావేశాలు నిర్వహించింది. ప్రజా సమస్యలపై వివిధ కార్యక్రమాలు చేసింది. అరవింద్‌ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నప్పుడు పలు చోట్ల ఆయనపై దాడులు సైతం జరిగాయి. కాన్వాయ్‌ ను అడ్డుకుని దాడులు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ అరవింద్‌ మాటల తూటాలు.. అందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల కౌంటర్లు ఇలా ఈ ఏడాదిలో కొంత పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఎమ్మెల్సీ కవిత సైతం ఎంపీ అరవింద్‌ పై చేసిన హాట్‌ కామెంట్స్‌ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిందనే చెప్పవచ్చు.

బీజేపీ నియోజకవర్గాల్లో పలు సందర్భాల్లో సభలు సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో జోష్‌ నింపింది. అయితే బీజేపీ పార్టీలో జంప్‌ జిలానీలతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిరదనే చెప్పవచ్చు. ఈ ఏడాది జిల్లాకు కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకుల పర్యటనలు కూడా జరిగాయ్‌. ప్రధాని నరేంద్ర మోదీ సభ కూడా నిర్వహించారు. బోధన్‌, కామారెడ్డి జిల్లాలో రాజా సింగ్‌ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఊపు తీసుకొచ్చింది.ఇక ఏడాది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పూర్వవైభవం కోసం కష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నుంచి చాలా మంది నేతలు బీఆర్‌ఎస్‌, బీజేపీలకు జంప్‌ అయ్యారు. జిల్లా కాంగ్రెస్‌ లో గ్రూప్‌ రాజకీయాలతో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. పార్టీ బలోపేతంలో నాయకుల మధ్య పోరు ప్రభావితం చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి జిల్లాలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎదుటే ఆ జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలు బైటపడ్డాయి. మదన్‌ మోహన్‌ రావు, సుభాష్‌ రెడ్డిల వర్గపోరు తారాస్థాయికి చేరింది. మదన్‌ మోహన్‌ రావుపై కామారెడ్డి జిల్లా నేతలు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. అయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు.

ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అడపా దడపా కార్యక్రమాలు చేసింది. బలంగా ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లలేకపోయిందనే వాదన ఆపార్టీలోనే ఉంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. ముఖ్యంగా ఆర్మూర్‌, బాల్కొండ వంటి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేని పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం చతికిలపడి పోయింది. వర్గపోరు,. గ్రూపు తగాదాలు కాంగ్రెస్‌ పార్టీని వెంటాడుతున్నాయ్‌. ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగు సీనియర్‌ నేతలు టీపీసీసీలో కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. అయినా జిల్లాలో పార్టీ బలోపేతం కోసం వారి మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఇక బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ, వైఎస్సార్‌ టీపీ పార్టీలు పార్టీని జిల్లాలో పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేశాయి. వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేశారు. వైఎస్‌ అభిమానులను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అధకార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపై షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. బీఎస్పీ పార్టీ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సైతం ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేశారు. పార్టీ బలోపేతం కోసం కార్యచరణ రూపోందించుకున్నారు. జిల్లాలో కనీసం ఒక్కసీటైనా గెలిచేలా ప్రవీణ్‌ కుమార్‌ లక్ష్యం పెట్టుకున్నారు. టీడీపీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు జిల్లాలో పీఎఫ్‌ఐ కార్యకలాపాల బాగోతం బైటపడటం రాజకీయంగా కూడా దూమారం రేపింది. బీజేపీ నాయకులు అధికార పార్టీ, పోలీసుల అలసత్వం అంటూ ఆరోపణలు చేశారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు జిల్లా అడ్డగా మారటంపై బీజేపీ మండిపడిరది. అయితే ఇటు ఎన్‌ఐఏ, పోలీసు శాఖ పీఎఫ్‌ఐ ముఖ్య నాయకులను పట్టుకోవటంలో సఫలమైంది. ఈ ఏడాది ఉమ్మడి నిజామాబాద్‌లో రాజకీయ పరిస్థితి ఇలా సాగింది.