తెలంగాణాలో మరో మెడికో ఆత్మహత్య

తెలంగాణాలో మరో మెడికో ఆత్మహత్య

నిజామాబాద్‌లో మరో మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. అయితే.. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి స్వస్థలం పెద్దపల్లి. కాగా.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సనత్ ఆత్మహత్యపై సిబ్బంది, విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు.    గత నెల 25న ఇదే హాస్టల్‌లో హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మెడికోలు బలవన్మరణానికి పాల్పడటం కలకలానికి దారి తీసింది. రేపటి నుంచీ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సనత్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సనత్ ఆత్మహత్య పట్ల ప్రిన్సిపాల్ ఇందిర విచారం వ్యక్తం చేశారు. సనత్ స్నేహశీలి అని తెలిపారు. గత రాత్రి తన గదిలో చదువుకున్న సనత్ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.