గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు
గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు. గతంలో ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై ఆయన ట్విటర్లో స్పందించిన విషయం తెలిసిందే. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో పలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.