స్పీడ్‌ పెంచిన ‘పల్లా’

స్పీడ్‌ పెంచిన ‘పల్లా’
  • చేర్యాల మున్సిపాలిటీని చుట్టుముట్టిన గులాబీదళం
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో ప్రచారం
  • అభివృద్ధిలో పోటీ పడండి : రాజేశ్వర్‌‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల): జనగామ బీఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. నిన్న నామినేషన్‌ పల్లా బుధవారం నియోజకవర్గంలో చేర్యాల మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వార్డులన్నీ కలియ తిరిగారు. ప్రచారంలో పల్లాకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మారథం పట్టారు. అనంతరం కళ్యాణి గార్డెన్‌లో జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ‘నేను నాన్ లోకల్’ అని ఎన్నికల్లో తనతో తలపడడం చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తాను ఈ ప్రాంతానికి చెందిన వాడినని, లోకల్.. నాన్ లోకల్ అని విమర్శించడం మానేసి జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తనతో పోటీ పడాలన్నారు. ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోపే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను కచ్చితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. చేర్యాల పట్టణ అభివృద్ధికి కావాల్సిన నిధులు 18న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రితో విడుదల చేయించుకుందామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌‌ఎస్‌ సీనియర్‌‌ లీడర్లు జల్లి సిద్దయ్య, మండల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.