అద్దం చూసి కారు నడుపుతున్న మోడీ

అద్దం చూసి కారు నడుపుతున్న మోడీ
  • ప్రధానికి భవిష్యత్​పై ఆలోచనే లేదు
  • ఎప్పుడూ ఇతరులపై నెపం నెడుతుంటారు
  • మతతత్వ రాజకీయాలే ఆర్ఎస్ఎస్ ధ్యేయం
  • ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 

న్యూయార్క్​: ప్రధాని మోడీ.. భారత్ అనే కారును అందులోని అద్దం చూసి నడుపుతున్నారని, ఆయనకు దేశ భవిష్యత్​పై ఎలాంటి ఆలోచన లేదని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాషాయ నేతలు భవిష్యత్​గురించి ఎప్పుడూ ఆలోచించరన్నారు. సోమవారం న్యూయార్క్​లోని జవిట్స్ సెంట్ లో నిర్వహించిన సమావేశంలో రాహుల్​గాంధీ భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. దేశంలో మతతత్వ రాజకీయాలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ  ద్వేషాన్ని ప్రేమతో నివారిస్తుందన్నారు. ఈ క్రమంలో ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల ఆత్మశాంతికి నిమిషం పాటు మౌనం పాటించారు. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని బీజేపీ నేతలను ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ 50 ఏళ్ల క్రితం ఈ రైల్వే మార్గాన్ని నిర్మించిందని మా మీద తప్పు నెడతారని అన్నారు. అలాగే పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్ధాంతం ఎందుకు తీసేశారని అడిగినా కాంగ్రెస్ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటూ సమాధానాలు చెబుతారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వారు స్పందించే తీరు, చెప్పే సమాధానాలు చూస్తుంటే గతాన్ని చూడమని పదే పదే చెబుతున్నట్లు అనిపిస్తుందే తప్ప భవిష్యత్​గురించి ఆలోచించమన్నట్లు అనిపించదని అన్నారు. ఎక్కడ ఏం జరిగినా గతంలో ఉన్న వాళ్లను నిందించడమే తప్ప అప్పుడు ఏం చేయాలనే దానిపై బీజేపీ నేతలు ఆలోచించరని ఫైర్ అయ్యారు. 

తమది గాంధీ, గాడ్సేల పోరాటం..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటీష్ వారి వల్లే ఇది జరిగిందని తామెప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. ఇది తన బాధ్యత కాబట్టి రైల్వేశాఖ మంత్రిగా తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ మంత్రి చెప్పినట్లు తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. కానీ ప్రస్తుత మంత్రి తనకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారని రాహుల్ గాంధీ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకు ఉన్న తేడా ఇదేనని, మన దేశంలో ఇప్పుడున్న సమస్య కూడా ఇదేనని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. గాంధీజీ ముందు చూపు గలవాడని, ఆధునికుడు అని, ఓపెన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అని చెప్పారు. అలాగే గాడ్సే గతం గురించి మాట్లాడాడని, భవిష్యత్​ గురించి చెప్పలేదని.. ఆ కోపం, ద్వేషంతోనే జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడని వివరించారు.