ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో రూ. 22 లక్షల నగదు లభ్యం...
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో నగదు లభ్యమయింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా రూ.22 లక్షల నగదు తరలించినట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెంలో తనిఖీల్లో భాగంగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ..హైదరాబాదు నుండి జంగారెడ్డిగూడెం ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ బస్సులో నగదుపై పక్క సమాచారం రావడంతోనే తనిఖీలు చేశామన్నారు. అందులో రూ. 22 లక్షల నగదు గుర్తించామన్నారు. ఈ నగదును తీసుకొస్తున్న వ్యక్తి దగ్గర సంబంధిత పత్రాలు లేకపోవడంతో ఆ నగదు సీజ్ చేసి ట్రెజరీకు పంపినట్లు వెల్లడించారు.