సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారి పై ప్రమాదం

  • ఆటోను ఢీ కొట్టిన మధిర డిపో ఆర్టీసీ బస్సు
  • ముగ్గురు మృతి , 12 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి,కోదాడ:- జాతీయ రహదారి 365 బిబి పై బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది . మునగాల మండలం రామసముద్రం గ్రామం నుండి మోతే మండలం బుర్కాచర్ల లో మిరపతోటలో మిరపకాయ ఏరేందుకు 15 మంది కూలీలతో వెళుతున్న ఆటోను మధిర డిపో ఎక్స్ ప్రెస్ బస్సు మోతే - కేశవాపురం అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఢీ కొట్టటం తో ప్రమాదం చోటు చేసుకుంది . బస్సు ఢీ కొట్టండంతో ఆటో రోడ్డు పక్కన పడిపోయింది .

ఘటనా స్థలంలోనే ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు వదిలారు . మిగతా 12 మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా వైద్యశాలకు తరలించారు . మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం . కాగా ప్రమాదంలో మృతి చెందిన కూలీలు కందుల నాగమ్మ  , చెరుకు నారాయణమ్మ , పోకల అనసూర్య లు గా గుర్తించారు . ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై యాదవేందర్ రెడ్డి క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు .