మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలించిన కాంగ్రెస్ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ.
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను గురువారం కాంగ్రెస్ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలించారు. గత కొద్దిరోజుల క్రితం లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై జలవనరుల శాఖ పరిశీలించి వెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయింది.
ఈ పరిస్థితుల్లో గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో నిర్వహించిన మహిళా సదస్సు లో పాల్గొని మాట్లాడిన అనంతరం బ్యారేజ్ ని పరిశీలించి, కుంగిన ఘటనపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులు కేసీఆర్ కు ఏటీఎం లా ఉపయోగపడ్డాయన్నారు. దీనిపై విచారణ జరిపించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా రాహుల్ వెంట తాము వెళ్తామని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు పట్టుబట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుంగిన పిల్లర్ల పరిశీలన తర్వాత హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ ఏరియల్ వ్యూను పరిశీలించిన రాహుల్ గాంధీ తిరుగు పయనమయ్యారు.రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, జీవన్రెడ్డి తదితరులు ఉన్నారు.