‘భారత్’పై కాంగ్రెస్​ అభ్యంతరం

‘భారత్’పై కాంగ్రెస్​ అభ్యంతరం
  • ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా విందు ఆహ్వాన పత్రికలో రాష్ర్టపతి పేరు
  •  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌ మన దేశం పేరును ‘భారత్’ అని పేర్కొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ–20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారని, ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారని అగ్గిమీద గుగ్గిలమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో.. ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబర్​9న జరిగే జీ–20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది.. ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.