ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15శాతం
![ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15శాతం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_642287f3623f8.jpg)
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ ) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ఈపీఎఫ్ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.
మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో 2022-–23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15శాతం ఇవ్వాలని నిర్ణయించారు. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
2020-–21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ (PF)పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం.