చెల్పూర్ నుండి బంపర్ మెజారిటీ ఇవ్వాలి.. 

చెల్పూర్ నుండి బంపర్ మెజారిటీ ఇవ్వాలి.. 
  • బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలి..
  • ప్రజా ఆశీర్వాద యాత్రలో గండ్ర దంపతులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఈసారి ఎన్నికల్లో చెల్పూర్ నుండి బంపర్ మెజారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లో గ్రామ సర్పంచ్ నడిపెళ్లి మధుసూదన్ రావు, ఎంపీటీసీ చెన్నూరు రమాదేవి ల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన  ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర నాయకులు కేశవ్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పుచప్పుల్లు, కోలాటాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర దంపతులు మాట్లాడుతూ లీడర్ పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారదని, ప్రజల అభిప్రాయం కూడా  మారదని అన్నారు. కట్టప్పలు ఎంతమంది వచ్చినా ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలువడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పాలనకే  ప్రజలు పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. చెల్పూర్ గ్రామాన్ని దాదాపు 7కోట్లతో అభివృద్ధి చేశానని, తనతండ్రి స్వగ్రామమైన చెల్పూర్ గ్రామంలో మరోసారి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. తన వెంట ఉండి నాతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది, వెన్నుపోటు పొడిచి వెళ్లిన కట్టప్పలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.