ఎమ్మెల్సీ కవిత పిటీషన్ పై విచారణ 19కి వాయిదా..!
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఇది వరకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత.. తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కాగా ఈ పిటీషన్ పై గత కొద్ది నెలలుగా సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత పిటీషన్ పై శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే గత నెల 28న ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది.కానీ కోర్టు సమయం ముగియడంతో విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.