పాలమూరులో భయపెడుతున్న సింహం
- సింహం చీల్చేదెవరి ఓట్లు
ముద్ర, మహబూబ్నగర్:-రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు రోజుల్లో పోలింగ్ జరుగునున్నది. ఈ సమయంలో ఒక్కో సెగ్మెంట్లో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో చీలిక ఓట్లు భయపెడుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్న మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉద్యమకారుడు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగిన మున్నూరు రవి ఏ వర్గం ఓట్లను చీల్చుతారనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్లోకి ఉద్యమనేతలు లోపాయికారికంగా రవికి మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్పై వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతలు కూడా రవికి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రవి వైపు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సైలంట్గా ప్రచారం చేసుకుంటున్న మున్నూరు రవి ఇప్పుడు ఎవరి ఓట్లు చీల్చుతారనేది ప్రధాన పార్టీలకు భయం పట్టుకున్నది. సింహం గుర్తుతో పోటీ చేస్తున్న రవి.. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఓట్లకు గండి కొడుతారనే ప్రచారం జరుగుతున్నది.