పెద్ద పాలేరుగా పనిచేస్తా..
- పోరుగడ్డను అభివృద్ధి చేసి చూసిస్తా
- నిండుమనసుతో ప్రజలు ఆశీర్వదించండి
- జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
ముద్ర ప్రతినిధి, జనగామ : సాయుధ పోరాటాలకు పుట్టినిల్లు తెలంగాణ తొలి, మలి దశల పోరాటాల పురిటిగడ్డ అయిన జనగామ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పథంలో నడిపించి ఇక్కడి పాంత్ర ప్రజలకు పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మట్లాడుతూ గజ్వేల్, సిరిసిల్ల లాంటి అభివృద్ధిని ఇక్కడి పాంత్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జనగామ జిల్లా పాంత్ర భౌగోళిక, సామాజిక పరిస్థితులతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం అందజేసి ఆశీర్వదించారని, ఇక ఈ పాంత్ర ప్రజలు తనను ఆశీర్వదిస్తే ఒదిగి ఉంటూ ఎదుగుతానని నిధులు తీసుకొనివచ్చి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. జనగామకు స్వచ్ఛమైన నీరు అందజేయడమే తన అజెండాలోని మొదటి అంశమన్నారు. జనగామ ప్రాంత సమస్యలు అన్నీ పెద్దసారు (సీఎం కేసీఆర్)కు తెలుసునన్నారు. జనగామ ప్రాంత ప్రజలు తనను ఆదరిస్తున్నారని రాబోయే రోజుల్లో అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని కోరారు. సమావేశంలో మంత్రలు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీలు బొడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ సీనియర్ నేతలు బండ యాదిగిరిరెడ్డి, మేకపోతుల ఆంజేయులు, కందుకూరి ప్రభాకర్, తాళ్ల సురేశ్రెడ్డి, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.