గురుకులం ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

గురుకులం ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • విద్యార్థులతో కలిసి భోజనం
  • సమస్యలపై ఆరా

తుప్రాన్, ముద్ర:మెదక్ జిల్లా తుప్రాన్ గురుకుల పాఠశాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి  సత్యనారాయణతో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి, తరగతి గదులు ఒకే రూంలో  ఉండడంతో  అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్, తహశీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్కూల్ లో వాటర్ ప్లాంట్ మరమత్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా 50 వేల రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు.  కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

విద్యార్థులు కొంత మంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరా తీశారు. వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబుతో, మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో ఫోన్ లో మాట్లాడారు. ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు . స్కూల్ లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్ లో ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్, పాఠశాల ఆవరణ సానిటేషన్ పూర్తి చేయాలని  మున్సిపల్ కమిషనర్  ఖాజా మొయినుద్దిన్ ను ఆదేశించారు. స్కూలుకి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహసిల్దార్ ని ఆదేశించారు.

డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు. స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందితో పాటు వాచ్ మెన్ లను సన్మానించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాత 35 రెసిడెన్షియల్  స్కూల్ లో తుప్రాన్ స్కూల్ ఒకటి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు  పరిస్థితి చూడడానికి ఆకస్మత్తుగా వచ్చా అన్నారు.