బరోడా బ్యాంక్ ఎదుట రైతు సంఘం ధర్నా

బరోడా బ్యాంక్ ఎదుట రైతు సంఘం ధర్నా

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణ రైతు సంఘం జఫర్గడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలోని బరోడా బ్యాంక్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి నక్క యాకయ్య సిపిఎం మండల జోన్ బాధ్యులు వడ్లకొండ సుధాకర్ మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. లక్ష లోపు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెన్యువల్ పేరుతో పాత రుణాలను కొత్త రుణాలుగా మార్చే బుక్ అడ్జస్ట్మెంట్ విధానం ఆపాలని బ్యాంకులో రైతుల లోన్ అకౌంట్లను ఎప్పటికప్పుడు బ్యాంక్ అధికారులు అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడం వలన రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్దనుండి నూటికి రూపాయలు 3 నుండి 5 వరకు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్న పరిస్థితి ఉంది. 

దీని వలన రైతుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్.బి.ఐ. నిబంధనల ప్రకారం బ్యాంకులో ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్ల నుండి 18% చిన్న సన్న కారు రైతులకు పంట ఋణాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికి బ్యాంక్ మేనేజర్ అమలు చేయడం లేదని ఆరూపించారు. రైతులను వేధించడం సరికాదని ఆర్బిఐ నిబంధనలు అమలు చేయని లీడ్ బ్యాంకు మేనేజర్  చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా నిబంధనలను అమలు చేస్తు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కన్నబోయిన నాగయ్య, వేల్పుల పెద్ద రాములు, చిన్న రాములు, యాతం సమ్మయ్య, వడ్లకొండ రాజు, కొంతం అంజయ్య, ఎల్లయ్య, నరసయ్య, బుల్లెదుడయా, బక్క పిచ్చమ్మ, రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.