నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష
- 48 గంటల్లో 31 మంది రోగులు మృతి
నాందేడ్ : మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగడం లేదు. గడచిన 48 గంటల్లో మరో 31 మరణాలు అక్కడ నమోదవడం కలకలం రేపుతోంది. గతచిన 8 రోజుల్లో అక్కడ మొత్తం 108 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే ఓ పసికందుతో సహా 11 మంది మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సెంట్రల్ నాందేడ్లోని ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా అక్కడ మందుల కొరతలేదని డాక్టర్ శంకర్రావ్ చవాన్, ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడ్ పునరుద్ఘాటించారు. గత 24 గంటల్లో 1100ల మందికి పైగా రోగులకు వైద్యులు చికిత్స అందించారని, కొత్తగా మరో 191 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నామన్నారు. 24 గంటల్లో సగటు మరణాల రేటు గతంలో రోజుకు 13గా ఉండేదని, ఇప్పుడు 11కి తగ్గిందని తమ చర్యను సమర్ధించుకున్నారు. మరణాలలో అధికంగా పుట్టుకతో వచ్చే రోగాలతో బాధపడే పిల్లలు అధికంగా ఉంటుంన్నారని అన్నారు. ఆసుపత్రి సదుపాయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఇక ఆసుపత్రిలో మందుల స్టాక్ గురించి ప్రశ్నించగా.. సాధారణంగా ఆసుపత్రి బడ్జెట్ను బట్టి మూడు నెలలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంటుందని, మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదని అన్నారు. వారి ఆరోగ్యం క్షీణించడం వల్లే వారు చనిపోయారంటూ ఆసుపత్రి డీన్ చెప్పుకొచ్చారు.