కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు తప్పనిసరి కాదు 

కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు తప్పనిసరి కాదు 
  • క్రాష్‌ టెస్ట్‌ రూల్స్‌ అమలయ్యాక  నిబంధన అమలు లోకి 
  • కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 

న్యూఢిల్లీ :  ప్రస్తుతం కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లపై చర్చ జరుగుతున్నది. కారు ప్రమాదాలు జరిగిన సమయంలో మరణాలను తగ్గించేందుకు ఆరు బ్యాగులను అమర్చాలని ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. గడువు సమీపిస్తునన దరిమిలా కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేయబోవడం లేదని ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఎంసీ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కొత్త క్రాష్‌ టెస్ట్‌ రూల్స్‌ను అమలు చేసిన తర్వాత.. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనలు అమలులోకి తీసుకువస్తామన్నారు. 

దేశంలోని అనేక వాహన తయారీ సంస్థలు ఇప్పటికే తమ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కంపెనీలు సైతం ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం వినియోగదారులకు సైతం భద్రతపై అవగాహన పెరిగిందని, ఈ క్రమంలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లను అందించే వాహనాలకు డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. అయితే, గతేడాదిలో కేంద్రమంత్రి కొత్త ప్యాసింజర్‌ కాస్లలో ఆర్‌ ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది టాటా అండ్ సన్స్ మాజీ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కారు వెనుక సీటులో కూర్చున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ క్రమంలో కారు ముందు సీట్లో కూర్చున్న వారేకాకుండా వెనుకసీట్లో కూర్చున్న వారు సైతం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో సరికొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.

కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయబోవడం లేదన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.  మంగళవారం సైతం డీజిల్‌ వాహనాలపై అదనంగా జీఎస్టీని విధించనున్నట్లు కేంద్రమంత్రి ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈవీ వాహనాలను ప్రోతహిస్తూ కాలుష్యాన్ని విడుదల చేసే డీజిల్‌ కార్లపై అదనంగా 10శాతం జీఎస్టీ పెంచాలని ఆర్థికశాఖ మంత్రికి ప్రతిపాదనలు అందజేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఆటోరంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత స్పందించిన కేంద్రమంత్రి ఇప్పటికప్పుడే డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలపై జీఎస్టీని విధించే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదని వివరణ ఇవ్వడం కొసమెరుపు. ఈ క్రమంలో  ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందా? లేదా? ప్రశ్నార్థకంగా మారింది