జాబిల్లికి దగ్గరగా  చంద్రయాన్–3

జాబిల్లికి దగ్గరగా  చంద్రయాన్–3
  • 25 కి.మీ. దూరంలో ‘విక్రమ్’ ల్యాండర్​
  • రెండోసారి డీ బూస్టింగ్​సక్సెస్
  • రష్యా లూనా–25 ప్రయోగం విఫలం

శ్రీహరికోట:  భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వాటి పనితీరుపై ఇస్రో సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండూ సజావుగా సాగుతున్నాయని తెలిపింది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఇప్పటివరకు తలెత్తలేదు. ఇప్పటికే మొదటిసారి డీబూస్టింగ్​ప్రక్రియను చేపట్టిన శాస్ర్తవేత్తలు.. శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో రెండో విడత చేపట్టిన డీ బూస్టింగ్​లో కూడా సక్సెస్ సాధించారు. దీంతో చంద్రయాన్​–3 ప్రస్తుతం చంద్రుడికి 25 కి.మీ. దూరంలో ఉంది. కాగా చంద్రుడిపై దిగే సమయంలో మార్పులు చేశారు శాస్ర్తవేత్తలు. 23వ తేదీ సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3 జాబిల్లి మీద కాలు మోపుతుందని ఇదివరకు ఇస్రో ప్రకటించింది. అయితే ఇపుడు 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై దిగనున్నట్లు వెల్లడించారు. సమయం మార్పు విషయంపై శాస్ర్తవేత్తలు కారణాలు వెల్లడించలేదు. చంద్రయాన్​2 సమయంలో జరిగిన తప్పిదాలను మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు. నిమిష నిమిషానికి చంద్రయాన్​–3పై పూర్తి అధ్యయనం కొనసాగిస్తూ సాఫ్ట్​ల్యాండింగ్​ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • రష్యా ప్రయోగం విఫలం..

సుమారు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన తొలి చంద్రుడి యాత్ర విఫలమైంది. శనివారం 5.27 నిమిషాలకు లూనా 25 అంతరిక్ష నౌకతో సంబంధాలు తెగిపోయాయని ఆదివారం రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. ఈనెల 21న లూనా 25 చంద్రుడిపై ల్యాండ్​ కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్, రష్యా చంద్రుడిపై చేపడుతున్న ఈ ప్రయోగాలపైనే దృష్టి సారించాయి. భారత్​కంటే ముందే రష్యా తన అంతరిక్ష నౌకను ప్రయోగించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం సాంకేతిక సమస్యతో లూనా కక్ష్య నుంచి పక్కకు తప్పుకొని ప్రయాణిస్తూ చంద్రుడి ఉపతరితలంపై క్రాష్​ల్యాండింగ్​అయినట్లు రష్యా శాస్ర్తవేత్తలు ప్రకటించారు. కాగా చంద్రుడిపై దిగే క్రమంలో డీబూస్టింగ్​ ప్రక్రియ అత్యంత కీలకమని శాస్ర్తవేత్తలు తెలియజేశారు. ఈ ప్రక్రియలో లోపంతోనే లూనా–25 వేగాన్ని తగ్గించలేకపోవడంతో ప్రయోగం విఫలమైనట్లు తెలిపారు.