అమెరికాలో కాల్పులు
- 22 మంది మృతి, 60 మందికి గాయాలు
న్యూజెర్సీ: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. భారత కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో 22 మంది మృతిచెందగా, 60 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. బార్ బౌలింగ్ అల్లే, వాల్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుడు రెండు చోట్ల కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లనుంచి బయటికి రావద్దన్నారు. అనుమానితుడు కాల్పులకు పాల్పడిన అనంతరం పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
దుండగుడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు జరిపాడన్నారు. గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్ సభ్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడిని రాబర్ట్ కార్డ్గా గుర్తించినట్లు ప్రకటించారు. 40 ఏళ్ల రాబర్ట్ మైనేలోని యూఎస్ ఆర్మీ రిజర్వ్ ట్రైనింగ్ సెంటర్లో ఫైర్ ఆర్మ్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి రిటైర్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాల్పులు జరిగే ఘటనలో అమెరికా ముందువరుసలో ఉండడం విశేషం.