సిమెంట్ లారీని ఢీకొన్న సుమో
- 13మంది మృతి
బెంగుళూరు: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుంచి టాటా సుమో ఢీకొట్టడంతో 13 మంది మృతిచెందారు. బాధితులంతా ఏపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం చోటు చేసుకుంది. దసరా పండుగ కోసం స్వస్థలాలకు వచ్చిన వీరంతా తిరిగి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిక్బళ్లాపూర్ బాగేపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద సిమెంట్ మిక్సర్ లారీ ఆగి ఉండగా టాటా సుమో అతివేగంతో ఢీకొనడంతో వీరంతా మృతిచెందినట్లు తెలిపారు. సుమోలో మొత్తం 18 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు మరో కారణం పొగమంచు కూడా అయి ఉండవచ్చునని అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. మృతులను కూలీలుగా గుర్తించారు. వీరంతా ఏపీలోని సత్యాసాయి జిల్లా గోరండ్ల మండలానికి చెందినవారన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో టాటా సుమోను వెనక్కి లాగారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందగా మిగతా ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారన్నారు. వాహనం మిక్సర్ లారీలో ఇరుక్కుపోవడంతో దాన్ని లాగేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. క్రేన్తోపాటు, కట్టర్ తదితరాలను వాడి అతికష్టమ్మీద ప్రమాదానికి గురైన వారిని బయటికి తీయగలిగారు. ప్రమాదం ఏపీ సరిహద్దుకు 40 కి.మీ. దూరంలో జరిగింది.