దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరపాలి- మంత్రి హరీశ్ రావు

దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరపాలి- మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట, ముద్ర ప్రతి నిధి :తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్ధిపేట నియోజకవర్గంలో వైభవంగా నిర్వహిద్దాం. సిద్ధిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. 

స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.దశాబ్ద కాలంలో శతాబ్ధి అభివృద్ధి సాధించాం. నాడు ఉద్యమంలో ముందున్నాం. నేడు అభివృద్ధిలో ముందున్నాం. ఇవాళ అభివృద్ధికి సిద్ధిపేట అధ్యయన కేంద్రంగా మారింది.ఇతరులకు గొప్ప మార్గదర్శనంగా నిలిచాం.ఇదంతా జరిగిదంటే దీని వెనుక తీవ్రమైన ప్రయత్నం ఉంది. సిద్ధిపేట నియోజకవర్గం ప్రగతిలో అగ్రగామిగా నిలిపామని మంత్రి వివరించారు.ఆధ్యాత్మికం, పర్యాటకం. ఇలా ఏ రంగంలోనైనా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గుణాత్మక మార్పు సాధించాం.21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నాడు-నేడు సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలనిసూచించారు. 

మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమైతే ఈ కార్యక్రమం ప్రతీ గ్రామంలో విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు.