మోదీ వర్సెస్ రాహుల్

మోదీ వర్సెస్ రాహుల్
  • బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లే
  • తెలంగాణలో  12  ఎంపీ సీట్లు పక్కా
  • అధ్వాన్నంగా రాష్ట్ర  ఆర్దిక పరిస్థితి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే  రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా 80 శాతానికిపైగా ప్రజలు మోదీనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా ఈసారి ఢిల్లీకి వేసే ఓట్లన్నీ పువ్వు గుర్తుకేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ 8 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు బాగోలేవని, ఉద్యోగుల జీతాలకు కూడా పైసల్లేవన్నారు. ఇగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు సీఎం, మంత్రులు కొత్తగా ఇస్తున్న హామీల అమలు దేవుడెరగని చెప్పారు.

దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుందని ఈసారి బిజెపికి 350 సీట్లు రాబోతున్నాయి అన్నారు. ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా సీట్లు సాధించబోతుందని తెలిపారు. మోడీ లేని భారత్ ను దేశ ప్రజలు ఎవరు ఊహించుకోవడంలేదని చెప్పారు. తెలంగాణలోనూ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోవడం ఖాయం అన్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఉన్నందున రాష్ట్రానికి రావలసిన నిధులతో పాటు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అదనపు నిధులు కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడం కష్ట సాధ్యమే అన్నారు. దీనికి తోడు కొత్తగా మంత్రులు ఎవరికి వారే కొత్త కొత్త హామీ ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు.


ఈరోజు కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో బీజేపీ మండలాధ్యక్షులతోపాటు కొత్తగా ఎంపిక చేసిన మండల ఇంఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, కరీంనగర్, రాజన్న జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.