నేటి నుంచే మహిళల పోరు
భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు గత కొంతకాలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ నేటి నుంచే మొదలుకానుంది. ముంబై లోని డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగబోయే తొలి సీజన్ లో ఐదు జట్లు ఢీకొనబోతున్నాయి. తొలి మ్యాచ్ ముంబై - గుజరాత్ మధ్య నేటి రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. మార్చి 4 నుంచి 26 వరకు సాగే ఈ మెగా సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐదు జట్లు పాల్గొంటున్న తొలి సీజన్ కు ముందు గత నెలలో ముగిసిన వేలంలో సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొంటే వారిలో 87 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.