వైజాగ్లో తగ్గిన వర్షం.. మ్యాచ్కు సర్వం సిద్ధం
భారత్–- ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది మైదానంలో కవర్లను తొలగించి వర్షపు నీటిని బయటకు పంపిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లు మైదానానికి చేరుకున్నాయి.
వర్షం తగ్గడం.. అనుకున్న సమయానికి మ్యాచ్ జరుగుతుండటంతో వైజాగ్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. టికెట్లు ఉన్నవాళ్లను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నగరంలోని హనుమంతవాక ,కార్ షెడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వైజాగ్లో గత రెండు రోజులతో పాటు ఆదివారం కూడా వర్షం కురవడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. ఎట్టకేలకు ఉదయం 11.30 గంటల నుంచి వర్షం నిలిచిపోయి ఎండ రావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురించాయి.