కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ నజర్

కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ నజర్
  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు ప్లాన్
  • ఎన్నికల సరళిపై కార్యకర్తలతో చర్చలు
  • ఎంపీ ఎలక్షన్స్ పై క్యాడర్ కు మార్గదర్శకాలు
  • సంక్రాంతి తరువాత  జనంలోకి 
  •  రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్ అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై సమీక్షించనున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో బీజేపీకి అధిక ఓట్లు వచ్చాయి? ఏయే గ్రామాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది? పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న మండలాలు, గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత? అనే అంశంపై లోతుగా విశ్లేషించనున్నారు.


అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిన అనంతరం మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం  5 జిల్లాల్లో విస్తరించింది. మొత్తం 40 మండలాలు, 671 గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం 16,51,534 మంది మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీకి వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషించనున్నారు. అనంతరం బీజేపీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రాబోయే 45 రోజులపాటు తన పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించిన బండి సంజయ్ సంక్రాంతి తరువాత నేరుగా జనం వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.