గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

 గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
  •  స్వయంపాలన లో మారిన గ్రామాల రుపు రేఖలు
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమనీ, సిఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారాయనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో శనివారం మంత్రి గంగుల కమలాకర్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని కరీంనగర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తొలుత నగరంలోని 17వ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన మంత్రి సుమారు 50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పనులను త్వరగా చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద 4 కోట్ల 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న రోడ్, డ్యామ్ పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కు వచ్చే ప్రతి ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రేకుర్తి నుంచి యూనివర్సిటీ మీదుగా,  మరోవైపు పద్మనగర్ నుండి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు. బొమ్మకల్ నుండి ముగ్ధుంపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని  ఇప్పుడు కొత్తపల్లి సహజ కాలేజీ నుండి వెలిచాల ఎక్స్ రోడ్డు వరకు 5.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేపట్టి  ఆగష్టు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం కరీంనగర్ రూరల్ మండలం చామన్ పల్లి చేరుకున్న మంత్రి గంగుల చామన్ పల్లి నుండి వెదురుగట్ట వెళ్ళే రోడ్డు పై బ్రిడ్జి నిర్మాణ మిగులు పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గతంలోనే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ  కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు నిలిచి పోయాయి. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం పై ప్రత్యేక దృష్టిని సారించిన మంత్రి గంగుల సమస్యను పరిష్కరించి మిగులు పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హామి ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల చేతుల మీదుగా గత నెల రోజుల క్రితం శంకుస్థాపన చేసిన చామనపల్లి -ఇరుకుల్ల గ్రామానికి లింకు రోడ్డు పనులు పూర్తై వాడుకలోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకట్ట పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తానని సాయంత్రం వేళ అహ్లాదకరమైన వాతావరణంలో కట్ట పై కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేస్తానని మంత్రి హామి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గత పాలకులకు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదని  స్వయం పాలనలో అడగకున్నా సీఎం కేసీఆర్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల అభివృద్దే మా ధ్యేయమన్న మంత్రి గంగుల తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని ఎప్పుడైనా ఊహించామా అన్నారు. ప్రతి గ్రామంలో అడుగకున్నా, ఇంకా చాలు అనేలా రోడ్లు వేశామన్నారు. అన్నివర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వధ్యేయమని మన ఫ్రభుత్వాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. గతంలో ఎండ కాలం వస్తే బీళ్ళు పడ్డ చెరువులు కనిపించేవని కానీ సిఎం కెసిఆర్ పాలనలో కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి మండుటెండల్లో సైతం మత్తడి దూకిస్తున్నామన్నారు. దీంతో గ్రామాల్లో తాగు, సాగునీరు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు.