ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
  • రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పై చర్యలు తీసుకోండి
  • మధ్య మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి
  • ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపిన బండి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కరించాలంటూ బహిరంగ లేఖను రాశారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ సమస్యలను అధిగమిస్తూ ప్రజా అకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్దంగా పనిచేయాలని కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరబడి అపరిష్క్రతంగా ఉన్న మిడ్‌ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏండ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్‌ మానేరు లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్‌ 15న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్‌ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు.


12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ను, స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు కానీ అది నెరవేర్చలేదు. ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అట్లాగే 2009 కొత్త గెజిట్‌ ప్రకారం తేది 01-01-2015 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తానన్నరు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడం దురదృష్టకరం అన్నారు. రెండేళ్ల క్రితం మిడ్‌ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు, మీతోపాటు నేను హాజరై ముంపు బాధితులకు సంఫీుభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి ధర్నాలో మిడ్‌ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు శ్రీ సంతోష్‌ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోనూ ముంపు బాధితులకు న్యాయం చేస్తానని ప్రకటించడం సంతోషదాయకం అన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూనే మరోసారి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను అన్నారు.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరారు. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలని అన్నారు. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోయినందున ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నీలోజిపల్లి నుండి అగ్రహారం వరకు ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ను, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కళాశాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించాలని, అదే విధంగా అర్హత లేకున్నా ప్రభుత్వం నుండి లబ్ది పొందిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ రావుతోపాటు మాజీ సీఎం బంధువులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమస్యలపై వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరించాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని ఆ లేఖలో విజప్తి చేశారు.