జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు...
ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఈరోజు దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్ , మహారాష్ట్రలోని నాగ్పూర్ , గోవా విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే ఆయా విమానాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమెయిల్ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.