నవరత్నాలు పేదలందరికి ఇళ్లు" పథకంలోని 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్

నవరత్నాలు పేదలందరికి ఇళ్లు" పథకంలోని 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్
  • వడ్డీ రాయితీ కింద రూ.46.90 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్

గుంటూరు : పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 4,500.19 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లెస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన వడ్డీ రీయింబర్స్ మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్దిదారులకు రూ.46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుండి రూ.15 లక్షలు పలుకుతున్న పరిస్థితిలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు కనీసం రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు లబ్ధి.. రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్ల సంపద చేకూర్చినట్లు తెలిపారు.

'రాష్ట్రంలో పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారం కావాలన్న తపనతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల పైచిలుకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే గాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇంటికి 2.70 లక్షలు మేర లబ్ది చేకూరుస్తూ, ఆపై మరో లక్షకు పైగానే ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు చేస్తూ యూనిట్ కు రూ.1.80 లక్షలు చొప్పున లబ్ధిదారులకు అందిస్తూ ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించటంతో ఇంకో రూ. 40వేల మేర లబ్ధి చేకూరుస్తూ మరోవైపు పావలా వడ్డికే రూ. 35వేలు చొప్పున బ్యాంకు రుణం మనందరి ప్రభుత్వంలో అదుతోంది' అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల మంజూరు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 22 లక్షల ఇళ్ళ నిర్మాణంలో ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందించగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.