పెండ్లి బృందంపై కారుతో దాడి .. యువతి మరణం

పెండ్లి బృందంపై కారుతో దాడి .. యువతి మరణం

ముద్ర,మెదక్ జిల్లా:- బంధుమిత్రులు సమక్షంలో ఓ యువతి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి కూతురిని అత్తారింటికి పంపించారు.. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఓ కిరాతకుడు పెళ్లి బృందంపై కారుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ యువతి మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీతో గురువారం రాత్రి జరిగింది.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. స్థానిక ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ పెళ్లి గురువారం జరిగింది. అందరూ సంతోషంగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. సాయంత్రం సువర్ణకి అప్పగింతలు చెప్పి మెట్టినింటికి పంపించారు. తిరిగి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, ఉప్పు వెంకటి గొడవ పడ్డారు. వీరికి గత కొంత కాలంగా భూమి పంచాయితీ నడుస్తుంది. పెళ్లింట ఏదైనా పరాభవం చేయాలని ఉప్పు నరేందర్ అనుకున్నాడు.

కోపంతో ఉన్న నరేందర్ తన కారుతో పెండ్లి వారి బృందంపై తొలడంతో ఉప్పు రమ్య(20), ఉప్పు దుర్గయ్య, యాదగిరి, ఉప్పు సుజాత, బబ్జు కు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటువైపు భీం రావ్ పల్లికి చెందిన కాపు యాదగిరి బైక్ పై వస్తుండగా అతనిపై కూడా దూసుకువెళ్లాడు.. దీంతో యాదగిరి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నార్సింగి హాస్పిటల్ కి తరలించారు. ఉప్పు రమ్య, దుర్గయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో రమ్య కన్నుమూసింది. విషయం గురించి తెలిసిన చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లిలో ఎంతో సందడి చేసిన రమ్య కానరాని లోకానికి వెళ్లిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధులు కన్నీరు మున్నీరయ్యారు.