'ఉక్కు సైన్యం'గా చైనా మిలటరీ: జిన్‌పింగ్

'ఉక్కు సైన్యం'గా చైనా మిలటరీ: జిన్‌పింగ్

బీజింగ్: దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు చైనా  భద్రతను మరింత పటిష్టం చేస్తామని, బలగాలను  ఉక్కు గోడగా తీర్చిదిద్దుతామని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్  ప్రతిన బూనారు.  చైనా దేశాధినేతగా మూడోసారి భాద్యతలు స్వీకరించిన అనంతరం పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జిన్‌పింగ్ సోమవారం మాట్లాడుతూ, దేశ సార్వభౌమాధికారం, భద్రత, దేశ అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షణకు మిలటరీని దుర్భేద్యమైన ఉక్కుగోడగా తీర్చిదిద్దుతామని అన్నారు. అమెరికాతో చైనా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల కాలంలో బలహీనపడటం, భారత్ వంటి పొరుగుదేశాల్లో సరిహద్దు వివాదాల నడుమ జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

తైవాన్ అంశంపై జిన్‌పింగ్ ప్రస్తావిస్తూ, తైవాన్ అంశం పరిష్కారానికి తాము కృషి చేస్తామని, ఇదే సమయంలో ఇతర దేశాల జోక్యాన్ని, వేర్పాటువాద కార్యక్రమాలను చైనా బలంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. అంతర్జాతీయ వ్యహహారాలు, ప్రపంచ పాలనా వ్యవస్థ సంస్కరణలు, అభివృద్ధి విషయంలో చైనా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2050 నాటికి చైనాను గొప్ప అధునిక సామ్యవాద దేశంగా నిర్మించే బాధ్యత మన అందరి పైనా ఉందని దేశ ప్రజలకు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ''కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఆవిర్భావంతో... శతాబ్దాల పోరాటంతో.. జాతి అవమానాలను రూపుమాపాం. చైనా ప్రజలు తమ గమ్యాన్ని తామే నిర్దేశించుకునే మాస్టర్లుగా ఎదిగారు. తిరుగులేని దిశగా చైనా పురోగమిస్తోంది'' అని జిన్‌పింగ్ అన్నారు.