మెదక్ లో కాంగ్రెస్ కు కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు రాజీనామా

మెదక్ లో కాంగ్రెస్ కు కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు రాజీనామా
  • త్వరలో బిఆర్ఎస్ లో చేరుతా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ మామిళ్ళ ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మెదక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీనామాకు గల కారణాలను వివరించారు. గత 15 సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలకు ఓర్చి పార్టీని బలోపేతం చేస్తే పార్టీ అధిష్టానం డబ్బు సంచులున్నోళ్లకు టికెట్లు కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. అనేక కష్టాల్లో నష్టాలను, ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం,  పార్టీ బలోపేతం కోసం, మెదక్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, మెదక్ జిల్లా అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గల్లీలో ఉండే కాంగ్రెస్ ఓట్లను ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులు నోట్లుగా మార్చుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానం మారిపోయిందని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం,  ఇక్కడి పరిస్థితులు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మెదక్ నియోజకవర్గంలో 11 మంది నుండి 50 వేల రూపాయలు వసూలు చేసి దరఖాస్తులు స్వీకరించిన అధిష్టానం కనీసం ఫోన్ చేయకుండా మరో వ్యక్తిని అభ్యర్థిని ప్రకటిస్తామనడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానికంగా ఉండే పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా అందుబాటులో లేని, సమయానికి వచ్చే నాయకుల డబ్బు సంచులకు అమ్ముడుపోతుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా మెదక్ నియోజకవర్గ పార్టీని బలోపేతం చేసిన తిరుపతిరెడ్డిని సైతం మోసం చేశారన్నారు. డబ్బు సంచులతో వచ్చే అభ్యర్థులను ఖాళీ డబ్బాలతో సాగనంపుతామని మామిళ్ళ ఆంజనేయులు హెచ్చరించారు. 2009 నుండి 2014 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి ఏమిటో ముందు తెలపాలని సవాల్ విసిరారు. గతంలో తెలంగాణ సాధన ఉద్యమంలో టిఆర్ఎస్ లో పనిచేశాను, తదనంతరం కొన్ని కారణాల చేత కాంగ్రెస్ పార్టీలో పని చేశానని, రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి త్వరలోనే బిఆర్ఎస్ లో చేరనట్లు మామిళ్ళ ఆంజనేయులు ప్రకటించారు. మామిళ్ళ ఆంజనేయులుతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి సూఫి ఉన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్యాంసుందర్, శ్రీనివాస్, మడూరు చంద్రమోహన్ ఉన్నారు.