పదేళ్ల ప్రగతి చాటేలా అవతరణ వేడుకలు
కలెక్టర్ వరుణ్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నిర్మల్:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పదేండ్ల జిల్లా ప్రగతి ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు..నిర్మల్ కలెక్టర్ కార్యాలయం లో బుధవారం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను అధికారులకు వివరించారు. దశాబ్ది ఉత్సవాలు మండల, నియోజకవర్గం, జిల్లా వారిగా నిర్వహించే ఏర్పాట్ల పై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.
ప్రతీ శాఖ పదేండ్ల ప్రగతి పై ప్లెక్సీలు,ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్తమ సేవలు చేసిన వారిని సత్కరించాలన్నారు. 2వ తేదీన పతాకావిష్కరణ చేయాలన్నారు. 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం, 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ ఉంటుందన్నారు. 5న ‘‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’’జరుగుతాయన్నారు.7న ‘‘సాగునీటి దినోత్సవం’’8న ‘‘ఊరూరా చెరువుల పండుగ’’ 9న ‘‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’’నిర్వహించాలన్నారు. ఇలా 22 జూన్ వరకు నిర్దేశించిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డీ ఆర్వో లోకేష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.