ఉల్లాసంగా.... ఉత్సాహంగా...!

ఉల్లాసంగా.... ఉత్సాహంగా...!

సేద తీరుతున్న అభ్యర్థులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: నిన్నటి వరకు ఎన్నికల బిజీతో క్షణం తీరిక లేకుండా ఉన్న వివిధ నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు శనివారం నాడు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.   గత నెలరోజులుగా జనాల మధ్య తీరిక లేకుండా, నిద్ర లేకుండా ఉండగా, గురువారం పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై, ఓటింగ్ తీరుపై, మెజార్టీ పై తమ తమ పార్టీల నాయకుల తో అంచనాలు వేసుకోవడం, గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఉల్లాసంగా గడపడం కనిపిస్తోంది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ లో బిఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటి చేసిన అభ్యర్థులు ప్రస్తుతం సేద తీరుతున్నారు.   అసెంబ్లీ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  శనివారం నాడు బాన్సువాడ లోని చిన్న టీ స్టాల్ లో అలా ప్రశాంతంగా టీ తాగుతూ కూచున్నారు.

ప్రధాన రహదారి లోని సిటీ టీ ప్యాలెస్ కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వెళ్లిన పోచారం ఇతర కస్టమర్ల తో పాటుగా ఇరానీ చాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా సొంత ఊరిలో సామాన్యుడిగా ఉంటూ అందరితో కలిసిపోవడం పోచారంనకు మాత్రమే సాధ్యమని పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే బాన్సువాడ పట్టణం నుండి శబరిమల వెళ్ళుతున్న అయ్యప్పస్వాముల మహా పాదయాత్రను పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద జెండా ఊపి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.