విలేకరులే నిందితులు...!

విలేకరులే నిందితులు...!

డబ్బుల కోసం ఒత్తిడితోనే కుటుంబం బలి
కేసును ఛేదించిన నార్సింగి పోలీసులు
జీఎస్ఎల్ ఫౌండేషన్ లో సభ్యుడిగా చేరిన నీరటి రవి
సకాలంలో సభ్యులకు డబ్బులుచెల్లించలేక ఇబ్బందులు
దీన్ని ఆసరాగా తీసుకున్న పలు పత్రికల రిపోర్టర్లు
రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్​
భార్య పుస్తె తాకట్టు పెట్టి రూ.2.50 ఇచ్చిన రవి
ఒత్తిడిని తట్టుకోలేక ముగ్గురు కొడుకులను చంపి తానూ ఆత్మహత్య
పరారీలో ‘ఏబీఎన్, ఈనాడు,  నమస్తే తెలంగాణ’ రిపోర్టర్లు
వార్త, సాక్షి రిపోర్టర్లు,  ఓ హోంగార్డ్  రిమాండ్​కు తరలింపు
వివరాలు వెల్లడించిన రాజేంద్రనగర్  డీసీపీ శ్రీనివాస్

శంకర్ పల్లి/ శేరిలింగంపల్లి, ముద్ర: మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో సంచలనంగా మారిన రవి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. రవి ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితులలో 
ముగ్గురిని  పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురు విలేకరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ నార్సింగి ఏసీపీ కార్యాలయంలో వెల్లడించారు. 

జీఎస్ఎల్ ఫౌండేషన్ లో సభ్యుడిగా చేరి..
టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి 2022లో గుంటూరుకు చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా విజయనగరానికి చెందిన జీఎస్ఎల్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్స్ సంస్థలో సభ్యుడిగా చేరాడు. జీఎస్ఎన్  ఫౌండేషన్ లో ముందుగా రూ.2 వేలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ప్రతీ నెల 1000 చొప్పున ఆరు నెలలు ఇచ్చేవారు. రవి తన ఊర్లో ఉన్న వారితో జీఎస్ఎన్  ఫౌండేషన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. రవి సేకరించిన డబ్బు తిరుపతిరావుకు పంపగా తిరుపతిరావు ప్రతీనెల రవి ద్వారా సభ్యులకు డబ్బులు చెల్లించేవాడు. ఈ క్రమంలో వ్యాపారం బాగా నడుస్తున్న క్రమంలో  8 నెలల క్రితం రవి 0.39 గుంటల భూమిని కనుగోలు చేసి తన ముగ్గురు పిల్లల పేరు మీద ఎస్ఎన్ యూ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. 

డబ్బుల కోసం రిపోర్టర్ల వేధింపులు..
సుమారు మూడు నెలల నుంచి జీఎస్ఎన్  ఫౌండేషన్ తరఫున తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో రవిని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల సభ్యులు డబ్బుల గురించి అడుగుతూ వేధించారు. ఈ విషయం బయట తెలియడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీనివాస్, ఈనాడు రిపోర్టర్​ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్​ మహేశ్, సాక్షి రిపోర్టర్​ ప్రవీణ్, వార్త రిపోర్టర్​ శ్రీనివాస్ రెడ్డి.. రవితో మాట్లాడారు. జీఎస్ఎన్ ఫౌండేషన్  పేరు మీద ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని, ప్రభుత్వ భూమిలో ఫంక్షన్​ హాల్​ కడుతున్నావని, మేము న్యూస్ పేపర్లలో వార్తలు రాస్తామని బెదిరించి అతని వద్ద 20 లక్షలు డిమాండ్ చేశారు. 

భార్య పుస్తెలతాడు తాకట్టుపెట్టి.. రిపోర్టర్లకు ఇచ్చి..
ఆయా పత్రికల రిపోర్టర్ల వేధింపులు భరించలేని నీరటి రవి.. డిసెంబర్ 19వ తేదీన రవి తన భార్య పుస్తెలతాడు తాకట్టుపెట్టి రూ.2 లక్షల 50 వేలు తెచ్చి విలేకరులకు ఇచ్చాడు. శంకర్ పల్లి గ్రామంలో నివసించే హోంగార్డు నాగరాజు భార్య మణీలా కూడా జీఎస్ఎన్ ఫౌండేషన్ లో రవి ద్వారా డబ్బులు పెట్టినందున వారు కూడా డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. దీంతో చేసేదేంలేక రవి తన భార్య పేరున రావులపల్లి గ్రామంలో కొన్న రెండు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను శంకర్ పల్లిలో ఉండే శివకుమార్ అనే వ్యక్తి వద్ద తాకట్టుపెట్టి రూ.18 లక్షలు తెచ్చి నాగరాజుకు ఇచ్చాడు. 

రూ.2.50 లక్షలు ఇచ్చినా.. ఇంకా కావాలని..
నీరటి రవి రిపోర్టర్లకు రూ.2.50 లక్షలు ఇచ్చినా.. ఆ డబ్బు సరిపోదని.. రూ.20 లక్షలు కావాలని పత్రికల విలేకరులు రవిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే రిపోర్టర్ల బాధలు తట్టుకోలేక రవి చావాలని నిర్ణయించుకున్నాడు.  తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారని భావించి.. మార్చి 3వ తేదీన రాత్రి తన ముగ్గురు కొడుకులను చంపి, ఫంక్షన్ హాల్ రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న జీఎస్ఎన్ ఫౌండేషన్ కి చెందిన తిరుపతిరావు, ఏబీఎన్ రిపోర్టర్ మంగలి శ్రీనివాస్, ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ వడ్డే మహేశ్, మనీలా రామకృష్ణ పరారీలో ఉన్నారు. వార్త రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి, సాక్షి రిపోర్టర్ ప్రవీణ్ కుమార్, హోంగార్డ్ అల్లూరి రాజు అలియాస్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని దురాశతో ఎలాంటి మోసపూరిత స్కీంలలో, ఆన్ లైన్ ఆప్ లలో డబ్బులు పెట్టి మోసపోవద్దని, ఇలాంటి స్కీంల గురించి ఏదైనా సమాచారం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.