గోవా క్యాంపులో కేటీఆర్.....

గోవా క్యాంపులో కేటీఆర్.....
  • బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులతో భేటీ
  • సిట్టింగ్‌ స్థానాన్నినిలబెట్టుకోవాలని దిశానిర్దేశం
  • నవీన్ రెడ్డిని గెలిపించాలని కోరిన... KTR...
  • రసవత్తరంగా మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపపోరు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా:- సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవాకు తరలించారు. ఈ క్రమంలో గోవా క్యాంప్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచి్చనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పార్లమెంట్‌ పోరులో ముందంజలో ఉంటామని.. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచి్చనట్టు తెలిసింది.మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,439 ఓట్లు ఉన్నాయని.. ఇందులో వెయ్యికి పైగా ఓటర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన వారేనని.. నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య యాదవ్ ,ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 28న పోలింగ్‌ జరగనుండగా.. ఆయా పారీ్టలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించాయి. బీఆర్‌ఎస్‌ గోవా, ఊటీ.. కాంగ్రెస్‌ గోవాతో పాటు ఏపీ, కర్ణాటకలో శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. 100 మంది వరకు స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న బీజేపీ సైతం కొడైకెనాల్‌లో క్యాంప్‌ ఏర్పాటు చేయడం పోరు తీవ్రతకు అద్దం పడుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి యువ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి పోటీపడుతున్నారు.