రైతుల ముసుగులో రాజకీయాలు

రైతుల ముసుగులో రాజకీయాలు
  •  ధాన్యం పోయాల్సింది కళ్లాల దగ్గర తప్ప..
  • క్యాంపు కార్యాలయం ముందు కాదు.
  • ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలా.?
  • కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలకే పరిమితం మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతుల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ ధర్మపురిలో తాను బస చేసిన క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోయడం వెనుక రాజకీయ కోణం తప్ప మరొక్కటి లేదన్నారు. కమలాపూర్ లో 20 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం ఒక్క రైతుకు చెందిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయమని ప్రశ్నించారు. ధాన్యం పోయాల్సింది కళ్లాల దగ్గర తప్ప, రోడ్డు మీద పోస్తే రాజకీయం కాకపోతే..మరేంటీ అని మంత్రి అన్నారు.

రైతు ముసుగు వేసుకొని రాజకీయం చేయాలనుకుంటే ఎప్పటికీ చెల్లదని, ఎవరైతే రైతు ముసుగులో రాజకీయం చేస్తున్న దొంగలను గుర్తించాలన్నారు. కరెంట్ కష్టాలు అందరూ అనుభవించారని, అలాంటి కష్టాలను తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించారని మంత్రి అన్నారు. దశబ్దాల పాటు అధికారంలో కొనసాగిన పాలకులు ఎవరూ విద్యుత్ కష్టాలను తొలగించేందుకు కృషి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే విద్యుత్ ప్రగతిపై దృష్టి సారించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలకే పరిమితం అయ్యారు తప్ప ప్రజలకు ఏది అవసరమో గుర్తించ లేకపోయారన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో కరెంట్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని, పగలు కరెంట్ ఎనాడు ఉండకపోయేదన్నారు.

అలాంటి స్థితి నుంచి తెలంగాణ సాధించుకున్న అనతికాలంలోనే తెలంగాణను వెలుగులు తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. రాష్ర్ట ప్రగతి పథంలో నడిపించాలన్న ఒక సదుద్దేశ్యంతో ఉచిత కరంట్ ను అమలు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా రైతుల పంట సాగుకు పెట్టుబడి సాయ కింద రైతు బందును అమలు చేశారని. రైతు ప్రమాద వశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధి పాలు కాకుడదని ముందు చూపుతో రైతుబీమాను ప్రవేశపెట్టారన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలనుకున్న వారికి ప్రజలేతగిన సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీలు చిట్టి బాబు,కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ జితేందర్, మార్కెట్ చైర్మన్ రాజేష్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.