న్యూ ఇయర్ జోష్!
- ఆహ్లాదంగా కొత్త సంవత్సర వేడుకలు
- ఆంక్షల మధ్య సంబురాలు
- రోడ్లపై యువత కేరింతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే న్యూ ఇయర్వేడుకలు మొదలయ్యాయి. క్లబ్బులు, పబ్బుల్లో రద్దీ ఏర్పడింది. స్పెషల్ ప్రొగ్రాంల్లో డీజే స్టెప్పులతో యువత చిందేసింది. నగర శివారులోని పలు ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా ఈవెంట్లు జరిగాయి. ఈసారి పెద్ద ఈవెంట్లు నిర్వహించకున్నా.. కొంతమంది కుటుంబాలతో సహా శివారు ప్రాంతాల్లో ఎంజాయ్ చేశారు. కొత్త సంవత్సర వేడుకలపై ఈసారి పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలు, ఔటర్ రింగ్రోడ్డు ఏరియాల్లో రద్దీ కనిపించలేదు. రాత్రి 8 గంటల నుంచే పోలీసులు రోడ్లపై చెకింగ్ మొదలుపెట్టారు. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వాహనదారులను కట్టడి చేశారు. చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు, డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు రద్దీగా మారాయి. ఈ వేడుకల సందర్భంగా అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగాయి.