పసిమొగ్గలపై దారుణాలు..

పసిమొగ్గలపై దారుణాలు..
  • ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

కేరళ: పసిమొగ్గలపై వరుస దారుణాలు దేశంలో ఆగడం లేదు. కేరళలో ఓ బాలికపై అత్యాచార ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగుచూసింది. ఐదేళ్ల బాలికపై వలస కార్మికుడు మద్యం మత్తులో అత్యాచారం చేయడమే కాకుండా గొంతునులిమి దారుణంగా చంపేశాడు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా, బాలిక ఆచూకీ కోసం అంతటా వెతికిన తల్లిదండ్రులు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు తెలిశాయి. దర్యాప్తు అనంతరం ఆదివారం ఎర్నాకులం రూరల్ ఎస్పీ వివేక్ కుమార్ ఈ ఘటనకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. బీహార్​కు చెందిన ఓ కుటుంబం ఎర్నాకులంలో కూలీ పనులు చేసుకుంటోంది. ఆ దంపతుల ఐదేళ్ల కుమార్తె శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీని పరిశీలించి బీహార్​ కార్మికుడు అస్పాక్​ అస్లాంను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతను బాగా తాగి ఉన్నందువల్ల వెంటనే వివరాలు రాబట్టలేకపోయామన్నారు. మత్తువదిలాక అతన్ని విచారించగా బాలికపై అత్యాచారం జరిపి గొంతునులిమి హత్య చేసి గోనె సంచిలో ఉంచి పడవేశాడని అంగీకరించాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడి నుంచి మరిన్ని విషయాలు రాబడుతున్నట్లు ఎస్పీ వివేక్ కుమార్ స్పష్టం చేశారు.