ఆర్టీసీ బిల్లు వాపస్
![ఆర్టీసీ బిల్లు వాపస్](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64ddb69bc3fb1.jpg)
- పది సిఫార్సులను ఏం చేశారు?
- న్యాయ సలహా కోరిన గవర్నర్
- లా సెక్రెటరీకి ఫైల్ పంపించిన తమిళిసై
ముద్ర, తెలంగాణ బ్యూరో:ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరారు. ఈ మేరకు ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను న్యాయ శాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్అడిగారు. తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? నిర్థారించాలన్నారు. న్యాయశాఖ కార్యదర్శి వివరనల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఇటీవల శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గవర్నర్ పది సిపార్సులు చేశారు.
- ఇవీ గవర్నర్ ప్రతిపాదనలు
ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టీఎస్ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకే వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మాట(అండర్టేకింగ్) ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలి. వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యుటీ.. ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలి. తీవ్ర ఒత్తిడి, శారీరక సమస్యలు, ఆరోగ్యపర కారణాలను చూపుతూ కార్మికులు విజ్ఞప్తి చేసుకొంటే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం ఉండాలి. ఆర్టీసీలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లాగానే మానవీయంగా ఉండాలి. ప్రభుత్వంలో విలీనం చేసుకొన్న ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు రక్షణ ఉండాలి. పదోన్నతులలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి. వారి సర్వీసుకు పరిరక్షణ, పీఎఫ్తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంతకాలం ఆర్టీసీ ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలి. రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలనూ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేర్చాలి. ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని భరించాలి’ అని గవర్నర్ ప్రతిపాదించారు.