మరో మహమ్మారి వచ్చేస్తోంది 

మరో మహమ్మారి వచ్చేస్తోంది 
  • భారీగా ప్రాణ నష్టానికి అవకాశం ? 

న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి  సృష్టించిన విలయాన్ని పూర్తిగా మరచిపోక ముందే మరో కొత్త మహమ్మారి పుట్టుకొస్తుందా? ఇప్పటికే మానవాళి మీదకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్న వైద్యరంగ నిపుణులు. కొవిడ్-19 ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని విధ్వంసకరమైన మహమ్మారులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ మేరకు అమెరికన్​ వార్తాసంస్ధ  ఒక కథనాన్ని ప్రచురించింది. తదుపరి మహమ్మారి  ఎక్కవ ప్రాణాలు బలిగొనే అవకాశముందని యూకే వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షత వహిస్తున్నట్టు డేమ్ కేట్ బింగ్‌హామ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొవిడ్-19 మరీ అంత ప్రాణాంతకం కాదని, ఈ విషయాన్ని ప్రపంచం అదృష్టంగా భావించాలన్నారు. కాగా కొవిడ్-19 నుంచి భవిష్యత్‌ మహమ్మారి పుట్టుకురావొచ్చని అ కధనంలో పేర్కొంది.   
డిసీజ్ ఎక్స్​ వచ్చేస్తోంది.

కొవిడ్-19 తర్వాత రాబోయే మహమ్మారికి ‘డిసీజ్ X’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేరుపెట్టింది. ఈ మహమ్మారి ఇప్పటికే దారిలో ఉండొచ్చని తీవ్రంగా హెచ్చరించింది. కాగా 2019లో ఉద్భవించిన కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ కంటే డిసీజ్ X ఏకంగా ఏడు రెట్లు అధిక ప్రాణాంతకంగా ఉంటుందని డామ్ కేట్ బింగ్‌హామ్ హెచ్చరించడం గమనార్హం.  తదుపరి మహమ్మారి ఇప్పటికే ఉన్న వైరస్ నుంచి ఉద్భవించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అనేక వైరస్‌లలో ఒకదాని నుంచి పుట్టుకొచ్చే వైరస్‌ల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించొచ్చని డామ్ కేట్ బింగ్‌హామ్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వైరస్‌లు పరివర్తన చెందుతుంటాయని హెచ్చరించారు. ఇదిలావుండగా వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల వంటి అంశాలు భవిష్యత్తులో మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశాలను పెంచుతాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ యూకేహెచ్‌ఎస్ఏ  అధిపతి ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారీస్ ఆందోళన వ్యక్తం చేశారు. చురుకైన సంసిద్ధత చర్యల చాలా అవసరమని నొక్కి చెప్పారు.