క్యాబినెట్‌లో ఎంతకాలం ఉంటానో తెలియదు

క్యాబినెట్‌లో ఎంతకాలం ఉంటానో తెలియదు
  • ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్య 

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ- శివసేన ప్రభుత్వంతో తమ పార్టీ పొత్తుపై సందేహాలకు తావిచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. షిండే మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ ఎంతకాలం ఉంటానో తాను చెప్పలేనంటూ అజిత్ తాజాగా బాంబు పేల్చారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం పాల్గొన్న ఓ కార్యక్రమానికి ఆయన గైర్హాజర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అదేరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ తాను ఎంతకాలం కొనసాగుతానో చెప్పలేనన్నారు. 'మన సంస్థలు బలంగా ఉండాలి. ఈరోజు నేను మంత్రివర్గంలో ఉన్నాను. రేపు ఉంటానో ఉండనో నాకు తెలియదు. ఆర్థిక శాఖ నా చేతిలో ఉంది. రేపు ఉంటుందో లేదో చెప్పలేను. రేపు ఎలాగ ఉంటుందో ఎవరు చూసొచ్చారు?  అయితే మన విభిన్న వ్యవస్థలు మాత్రం బలంగా ఉండాలి'' అని బారామతి మార్కెట్ కమిటీ వార్షిక సమావేశంలో ఆయన అన్నారు. బాంద్రాలోని వినాయక మండపాన్ని అమిత్‌షా సందర్శించినప్పుడు సీఎం ఏక్‌నాథ్ షిండే, మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకాగా, అజిత్ పవార్ మాత్రం దూరంగా ఉండిపోయారు. అయితే, దీనిపై వచ్చిన ఊహాగానాలను అజిత్ తోసిపుచ్చారు. తన ముందస్తు కార్యక్రమాల గురించి అమిత్‌షా కార్యాలయానికి తెలియజేశానని చెప్పారు.